పరశురాముడు ఏర్పరచిన విధానాల మేరకు మహాదేవుణ్ణి ఈ ఆలయంలో ఉదయాన్నే దక్షిణామూర్తిగానూ, మధ్యాహ్నంవేళ కిరాతమూర్తిగానూ, సాయంకాలం సచ్చిదానందమూర్తిగానూ కొలుస్తారు
కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో, ప్రఖ్యాత పుణ్యక్షేత్ర ప్రాంతంలో వెలసిన వైకోమ్ మహాదేవుని దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో కొలువుదీరిన స్వామిని వైకతప్పన్ అని ముద్దుగా పిలుస్తారు. ఈ క్షేత్రంలో పూజలందుకుంటున్న శివలింగం త్రేతాయుగం నాటిదిగా భావించబడుతున్నది. ఈయనను అన్నదాన ప్రభువుగా కొలుస్తారు. స్వామికి గల మరోపేరు కరుణాస్వరూపు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎటువంటి ప్రభుత్వ శాసనాలూ అమలులోకి రాకముందునుంచే శైవ మరియు వైష్ణవ మతములవారే కాకుండా అన్ని కులాలవారూ దర్శించుకోవచ్చునని ఆచారంగా చేయబడింది. ఇక్కడ శివుడు కూడా తమతో కలిసి కూర్చొని భోంచేస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఒకప్పుడు ఈ స్వామి వారు ఆలయం లేకుండా మోకాలులోతు నీటిలో ఉండేవాడట. ఈ దారి వెంట వెళ్తున్న పరశురాముడు వెలుగులు విరజిమ్ముతున్న దక్షిణామూర్తిని తెలుసుకొని ఆ స్వామికి గుడి కట్టించి, పూజా విధానాలనూ ఏర్పరచాడని తెలియుచున్నది. పరశురాముడు ఏర్పరచిన విధానాల మేరకు మహాదేవుణ్ణి ఈ ఆలయంలో ఉదయాన్నే దక్షిణామూర్తిగానూ, మధ్యాహ్నంవేళ కిరాతమూర్తిగానూ, సాయంకాలం సచ్చిదానందమూర్తిగానూ కొలుస్తారు. శివుడు అభిషేకప్రియుడు కనుక ప్రతినిత్యం ఈ స్వామికి సహస్రకలశాభిషేకం జరిపిస్తారు. స్వామివారి దర్శనాన్ని ఆనందదర్శనం అని అభివర్ణిస్తారు.
ఈ మహాదేవుని ఆలయంలో రెండు వర్గాల పూజారులు పూజలు నిర్వహిస్తారు. అందుకు గల ఒక కారణం ఉన్నది. సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలోని గర్భగుడిలో పెద్ద మంటలు చెలరేగాయి. అదే సమయానికి ఆలయ తంత్రి (తంత్రి అంటే పూజారి) మోనాట్నంబూద్రి గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని ఒక రాగిపాత్రలో కప్పివేసి శివలింగము మంటల బారిన పడకుండా చేశాడు. ఆ తరువాత ఆయన వరుణమంత్రాన్ని జపిస్తూ శివ లింగాన్ని ఆలింగనం చేసుకుని అలా ఉండిపోయాడు. దాదాపు 12 రోజుల తర్వాత గర్భగుడిలో మంటలు ఆరిపోయాయి. అప్పుడు గుడిబయట ఉన్న ఇతర పెద్దలు గర్భగుడిలో శివలింగాన్ని కౌగిలించుకొని మూర్ఛపోయి పడి ఉన్న మోనాట్ నంబూద్రిని బయటకు తీసుకువచ్చి సపర్యలు చేసి ఆయనకు స్పృహ తెప్పించారు. స్పృహ నుండి మేలుకొన్న ఆ నంబూద్రి "శివుని ఆరాధించటంలో నేను పడిన కష్టాలు నా వంశంవారు, నా వారసులు ఎవరూ కూడా పడకూడదు. అందుకే ఈ ఆలయంలో వంశపారంపర్యంగా పూజారులు ఉండే మా కుటుంబ హక్కును నేను వదులుకుంటున్నాను" అన్నాడు. తనకోసం ప్రాణాలను కూడా లెక్కచేయక అగ్నిబాధను భరించి తన స్వరూపమైన శివలింగాన్ని కాపాడిన నంబూద్రి ఇకపై తనుగానీ, తన వారసులుగానీ, పూజలు చేయరు అన్న శపథం చేయటం వైకోతప్పన్కి (శివుడికి) ఎంతమాత్రం నచ్చలేదు. శివుడు తనను ఆరాధించే భక్తులకు ఎంత మేలైనా చేస్తాడు. కానీ తన భక్తుడైన నంబూద్రి అగ్ని ప్రమాదానికి భయపడి ఇకపై వైకోం ఆలయంలో పూజలు చెయ్యను అనటం శివుడికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఫలితంగా ఆయన నంబూద్రిని "ఇక పై ఈ మోన్నాట్మనకు చెందిన సంబూద్రి కుటుంబంలో పురుష సంతానం లేకుండా పోవుగాక" అని శపించాడు. ఆ తరువాత వైకోతప్పన్ ఆలయంలో పూజలు చేసే అధికారం మేకట్ అనే వంశానికి చెందిన నంబూద్రీలకు బదిలీచేయబడింది. ఆనాటి నుండి మేకట్ కుటుంబానికి చెందిన నంబూద్రీలే వైకోం శివాలయంలో పూజలు కొనసాగిస్తూ ఉండేవారు.
Comments
Post a Comment