శ్రీ లక్ష్మీ నరసింహస్వామి - పెన్న అహోబిలం ,శ్రీ మహావిష్ణువు, రాక్షసుడిని సంహరించి మహర్షికి శాంతిని ఆంధిచిన ప్రదేశం
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి - పెన్న అహోబిలం
అనంతపురం జిల్లా(anantpur), ఉరవకొండ మండలానికి సమీపంలో, పెన్నా నది ఒడ్డున గల ఒక ప్రాచీన దేవస్థానమే పెన్న అహోబిలం. అనంతపురం నుండి సుమారు నలభై కిలోమీటర్ల(40 km) దూరంలో, బళ్ళారి మార్గంలో గల ఈ ఆలయం, భక్తులకు విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. శ్రీ నరసింహస్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రమని, ఆయన కుడిపాద ముద్ర ఇక్కడ కనిపిస్తుందని భక్తుల నమ్మకం. అదే విధంగా, నరసింహస్వామి మరో పాదాన్ని అహోబిలం లో ఉంచి, భక్తులను అనుగ్రహిస్తున్నారని చెబుతారు.
చరిత్ర ప్రకారం, విజయనగర సామ్రాజ్యానికి చెందిన సదాశివరాయలు ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించినట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాదముద్ర ఉన్న స్థలంలో ఒక చిన్న బిలం ఉంది. ఈ బిలం ద్వారా స్వామివారికి అభిషేక జలం అంతర్వాహినిగా ప్రవహించి, మూడు కిలోమీటర్ల దూరంలోని మాన్నానదిలో కలిసిపోతుంది. ఈ విశేషం కారణంగా, ఈ స్థలాన్ని "పెన్న అహోబిలం" అని పిలుస్తారు.
స్థల పురాణం:
ఈ ప్రదేశం ఒకప్పుడు అరణ్యభూమిగా ఉండేది. ఇక్కడ ఉద్దాలక మహర్షి తపస్సు చేసేవారని పురాణ కథనాలు చెబుతున్నాయి. మహర్షి ప్రతిరోజు పెన్నా నదిలో స్నానం చేసి, ఒక పెద్ద వృక్షం కింద తపస్సు కొనసాగించేవాడు. కానీ అరణ్యంలో నివసించిన రాక్షసుడు అక్కడి జంతువులను వధించి, వాటి మృతదేహాలను నదిలో పారవేయడం వల్ల జలాలు కలుషితమయ్యేవి. మహర్షి ఈ సమస్యతో చాలా బాధపడుతుండగా, శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. భక్తుని కోరికను పూరించేందుకు నరసింహస్వరూపం ధరించి వచ్చిన శ్రీ మహావిష్ణువు, రాక్షసుడిని సంహరించి మహర్షికి శాంతిని అందిచడం వలనా ఈ స్థలంలోనే నరసింహస్వామి స్వయంభువుగా వెలసినట్లు నమ్ముతారు.
ఆలయ నిర్మాణం:
ఈ ఆలయం తూర్పు (east)ముఖంగా ఉండి, తూర్పు మరియు పశ్చిమ దిశల్లో గోపురాలు కలిగి ఉంది. ఉత్తర, దక్షిణ ద్వారాల ద్వారా కూడా ఆలయ ప్రవేశం ఉంది. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం, చెన్నకేశవస్వామి సన్నిధి ఉన్నాయి. భక్తులు స్వామివారికి ఆకుపూజలు, అభిషేకాలు, తలనీలాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకుంటారు.
1987లో ఈ ఆలయ పైన భాగంలో లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. వైశాఖ మాసంలో బహుళ అష్టమి నుంచి 15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. పండుగ వేళల్లో విశేష పూజలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుంటారు.
Comments
Post a Comment